కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్తో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పోలీసులు ప్రజలకు చేరువై సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి కాగజ్నగర్ రూరల్, రెబ్బెన, వాంకిడి, పెంచికల్పేట్, చింతలమానేపల్లి, కౌటాల పోలీస్ స్టేషన్లతోపాటు కాగజ్నగర్ సీఐ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్, రెబ్బెనలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేదని, ఇతరత్రా సమస్యలేవీ లేవన్నారు.
ప్రజల భద్రత కోసం రూ.600 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. సింగపూర్ తరహాలో పోలీస్ వ్యవస్థ సీఎం కేసీఆర్ పటిష్ఠం చేశారని తెలిపారు. నిరంతర నిఘా కోసం రాష్ట్రంలో 50 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని, ఆడబిడ్డల భద్రతకు ప్రత్యేకంగా షీ టీమ్లను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. కాగజ్నగర్లోని జూనియర్ కళాశాలలో కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు. కాగజ్నగర్ రూరల్ మండలంలో రూ.36 కోట్లతో నిర్మించిన రెండు మైనార్టీ గురుకులాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.