బంజారాహిల్స్, డిసెంబర్ 19: రియాలిటీ షో బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకున్నది. ఆదివారం జరిగిన బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం బయటకు వచ్చిన పోటీదారుల వాహనాలను అభిమానులు ధ్వంసం చేయడంతోపాటు రోడ్డు మీద వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైనా ప్రతాపం చూసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్తోపాటు పలువురు వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పోలీసులు, బిగ్బాస్ షో నిర్వాహకుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తిరిగి రావడంతో ఆయన అభిమానులు రెచ్చిపోయి పోలీసుల వాహనాలు ధ్వంసం చేసినట్టు దర్యాప్తులో తేలింది.
రాళ్లదాడి జరుగుతుండడంతో అక్కడినుంచి వెళ్లిపోవాలని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ సహా పలువురు అధికారులు కోరినా ప్రశాంత్ అక్కడినుంచి కారును ముందుకు తీయకపోవడంతో పరిస్థితి అదుపుతప్పిందని తేలింది. ఈ వ్యవహారంలో రెండు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనకు సంబంధించిన వీడియోల ద్వారా ఇతర నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. పల్లవి ప్రశాంత్కు మద్దతుగా సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేసిన వ్యక్తులతోపాటు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ను అక్కడకు పిలిపించిన వారు ఎవరనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. నగరం నడిబొడ్డున జరిగిన విధ్వంసాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ఏ-1 నిందితుడిగా చేర్చగా అతడితో పాటే ఉండి ఫ్యాన్స్ను రెచ్చగొట్టిన అతడి సోదరుడు మనోహర్ను ఏ-2గా, వారి స్నేహితుడు వినయ్ను ఏ-3గా చేర్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ను ఓపెన్ టాప్ కారులో చిత్రపురి కాలనీ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తిరిగి తీసుకువచ్చిన ఏ-4 నిందితుడు శంతని సాయికిరణ్(25), ఏ-5 నిందితుడు అంకిరావుపల్లి రాజు(23)ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడైన పల్లవి ప్రశాంత్ కోసం గాలింపు ప్రారంభించారు. బిగ్బాస్ విజేతగా నిలిచిన తర్వాత సొంతూరు కొల్గూరుకు వెళ్లిన ప్రశాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లినట్టు సమాచారం. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న ప్రశాంత్ అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్టు తెలిసింది. బిగ్బాస్ కంటెస్టెంట్లు అమర్దీప్, గీతూ రాయల్ తదితరుల కార్లను ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను, వీడియోలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.