హైదరాబాద్ : వాహనదారులకు పోలీస్శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణవ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్తో పాటు లోక్అదాలత్ ద్వారా చెల్లించే వీలు కల్పించారు. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా.. 25శాతం చెల్లిస్తే సరిపోతుంది.
ఆర్టీసీ బస్లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. గత రెండు సంవత్సరాలు కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.