హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పౌరుల ప్రాణాలను గోల్డెన్అవర్లో కాపాడేందుకు తెలంగాణ పోలీస్శాఖ వినూత్న కార్యక్రమం చేపడుతున్నది. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో బాధితులను సమీపంలోని దవాఖానకు తరలించి, అవసరమైతే రక్తదానం చేసి ప్రాణాలు కాపాడేలా ఒక కొత్త వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గోల్డెన్అవర్ దూతలను ఎంపిక చేసి, వారితో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నది. రోడ్ల వెంబడి వివిధ వ్యాపారాలు చేసేవారిని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చనున్నది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసే బాధ్యతను స్టేషన్హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)లకు అప్పగించారు. శుక్రవారం నుంచి ఈ పనిని అన్ని స్టేషన్ల ఎస్హెచ్వోలు నిర్వహించనున్నారు. తమ పరిధిలోని రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసేవారితో గ్రూప్లు క్రియేట్ చేస్తారు. వాటిని జిల్లా ఎస్పీ పర్యవేక్షించనున్నారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని ఆయా జిల్లాల ఎస్పీలు, ఎస్హెచ్వోలకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ప్రాణాలు కాపాటడమే లక్ష్యం
రోడ్లు వెంబడి దాబాలు, పంక్చర్ షాపులు, మెడికల్ షాపులు, చిన్న దుకాణాలు, టీ స్టాళ్లు, హోటళ్ల నిర్వాహకుల ప్రధాన విధి ఏమిటంటే.. ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితులను వెంటనే స్థానిక దవాఖానకు తీసుకెళ్లడం. అవసరమైతే రక్తదానం చేయడం. పోలీసులు, బాధితుల బంధువులకు సమాచారం అందించడం. ఈ మేరకు క్షతగాత్రులకు సాయం అందించేలా వారిని తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నది పోలీస్శాఖ. దీంతోపాటుగా ఏదైనా వాహనం అతి వేగంతో వెళ్తుంటే ఆ వివరాలను వీరు తమ గ్రూపులో తెలియజేస్తారు. దీంతో వచ్చే పోలీస్స్టేషన్ పరిధిలో ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయవచ్చునని భావిస్తున్నారు.