Telangana | హైదరాబాద్ : కవి, రచయిత అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య జయంతి, సాహితీ పురస్కారం వరించింది. ఈ నెల 22వ తేదీన దాశరథి 99వ జయంతి సందర్భంగా నటేశ్వర శర్మకు అవార్డు ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ. 1,01,116 నగదును అందజేయనున్నారు. 2022 సంవత్సరంలో దాశరథి 98వ జయంతి సందర్భంగా ప్రముఖ కవి వేణు సంకోజుకు అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి ఏడాది దాశరథి జయంతి(జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు ప్రదానం 2015 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య.. 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు.
2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేశారు. 2016లో జే బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్ గోపికి, 2018లో వఝల శివకుమార్కు, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2020లో డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు, 2021లో తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది.