హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ గుడిమల్ల తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషణ్.. సచివాలయం సమీపంలోని ఒక దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు కన్నుమూశారు.
సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ ఫొటోగ్రాఫర్గా భరత్ భూషణ్ వినుతికెక్కారు. హైదరాబాద్లోని నల్లకుంటలో నివాసముండే భరత్ ఇంటికి వెళ్లగానే పల్లె అందాలు మనల్ని కట్టిపడేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తీసే ప్రతి ఫొటోకు క్యాప్షన్లు అవసరం ఉండదు. అంటే, మనం ఫొటోను చూడగానే భావాన్ని గుర్తించవచ్చునన్నమాట. ఎన్నో పల్లె అందాలను తన కెమెరాలో నిక్షిప్తం చేసుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ఫొటోలను చిత్రీకరించారు. గురువు మురళీకృష్ణ వద్ద ఫొటోగ్రఫీ, పెయింటింగ్లో శిక్షణ పొందారు. 1970 దశకంలో ఫొటోగ్రాఫర్ వృత్తిలోకి అడుగుపెట్టి అదే వృత్తిని జీవితంగా మలుచుకున్నారు. పలు ఇంగ్లిష్, తెలుగు దినపత్రికల్లో ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. తీరిక సమయాల్లో పెయింటింగ్లు కూడా వేసేవాడు.
తెలంగాణ రాష్ట్ర తొలి వార్షికోత్సవంలో ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా రూ.లక్ష నగదు బహుమతిని సీఎం కేసీఆర్ అందజేశారు. ఫొటోగ్రఫీ విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతోపాటు రూ.లక్ష నగదు అందజేసి తెలుగు విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది.
తెలంగాణకు చెందిన ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భరత్ భూషణ్ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫొటోగ్రాఫర్గా ఆయన తెలంగాణ పల్లె అందాలను, తెలంగాణ జీవనశైలి, సంస్కృతి, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్, ఫొటోగ్రఫీ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. తెలంగాణ ఓ అరుదైన చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కాగా, భరత్ భూషణ్ మృతిపట్ల తెలంగాణకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లు సంతాపం ప్రకటించారు.