హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్పై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఆర్ఎస్పీ.. కేసీఆర్ సర్కారుపై ఇంత విషమా? అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ గురుకులాల అధికారిగా ఉన్నప్పుడు సంపాదించుకున్న పేరంతా అపరిపక్వ రాజకీయాలతో పోడగొట్టుకుంటున్నాడని అంటోంది.
అసలు జరిగిందేంటంటే?
ఛత్తీస్గఢ్లోని సుర్గూజా జిల్లా లఖన్పూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్దాస్.. తన కూతురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో శుక్రవారం దవాఖానకు తీసుకెళ్లాడు. బాలిక చికిత్స పొందుతూ కన్నుమూసింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈశ్వర్దాస్ తన కూతురు మృతదేహాన్ని భుజంపై వేసుకొని సుమారు 10 కిలోమీటర్లు నడిచి సొంతూరుకు చేరుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ అయ్యింది. ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.
అయితే, ఛత్తీస్గఢ్లో జరిగిన ఘటనను ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలంగాణకు ఆపాదించారు. ఓ పేపర్ భద్రాచలం డేట్లైన్తో ముంద్రించిన వార్తను జోడించి.. ‘పాలకులకు సిగ్గు, శరం ఉండాలె. వైద్యశాఖకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ప్రభుత్వంలో ఉండి కష్టాలు తీర్చడం చేతగాకపోతే గద్దె దిగండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ట్వీట్పై తెలంగాణ ప్రజలు ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కనీస పరిజ్ఞానం లేకుండా ప్రతి విషయాన్ని తెలంగాణకు, సీఎం కేసీఆర్కు ముడిపెడుతూ అడ్డగోలు వ్యాఖ్య చేయడమే రాజకీయం అని అనుకుంటున్నారని మండిపడ్డారు. విద్యావంతుడిగా చెప్పుకునే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇంత గుడ్డిగా విమర్శలు చేయడంపై, తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తాను చేసిన తప్పును గుర్తించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెంటనే ట్వీట్ను తొలగించడం గమనార్హం.