హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల తెలంగాణ పర్యటనలో తన అసమర్థతను, అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. కేవలం తెలంగాణను బద్నాం చేయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ర్టానికి వచ్చినట్టు స్పష్టమైంది. కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ను అవమానించిన నిర్మల.. మీడియాను ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. రెండుసార్లు ప్రెస్మీట్లను రద్దు చేసుకున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహిస్తామని, విలేకరులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని గొప్పలు చెప్పారు. కానీ.. మీడియా సమావేశానికి ఎంపిక చేసిన మీడియా సంస్థల ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించి, అందులోనూ ఎంపిక చేసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు. సమావేశం మొత్తం టెన్షన్ పడుతూ కనిపించారు. కామారెడ్డిలో ఆమె చేసిన రచ్చకు పరువు పోవడంతో దానికి సంజాయిషీ ఇచ్చుకోవడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. డీపీఆర్ అంటే డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్తూ.. తనకు కనీసం డీపీఆర్ అర్థం తెలియదని నిరూపించారు.
మా మంత్రి సమాధానం చెప్పలేరు
కేంద్ర మంత్రి ప్రెస్మీట్ అంటే సాధారణంగా ఏ మీడియా సంస్థ అయినా ప్రశ్నలను సిద్ధం చేసుకుంటుంది. ఆ ప్రశ్నలు ముందుగా తెలిస్తే వాటికి ధీటుగా సమాధానం ఇచ్చేలా సిద్ధం కావాలి. దమ్ముంటే మీడియా సాక్షిగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కానీ.. ‘సీఎంవో నుంచి మీడియా ప్రతినిధులకు ప్రశ్నలు వచ్చాయి’ అంటూ బీజేపీ నేతలు ఓ కాపీని ప్రదర్శించి నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే సంస్థల ప్రతినిధులను బయటికి పంపించారు. తద్వారా నిర్మల సీతారామన్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని బహిరంగంగా ఒప్పుకున్నారు.
తెలంగాణ షాన్ను ఎందుకు ఒప్పుకోరు?
‘పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ఇస్తున్న నిధులతో పోల్చితే.. తిరిగి వస్తున్నవి తక్కువ. పథకాల్లో కేంద్రం వాటా ఉంది కాబట్టి ప్రతిచోటా మోదీ ఫొటో పెట్టాలంటున్నారు. కేంద్రం ఖర్చు చేసే నిధుల్లో తెలంగాణ వాటా ఉంది కదా? మరి తెలంగాణ పేరును పెడుతారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా నిర్మల వింత సమాధానం ఇచ్చారు. తెలంగాణకు వచ్చే పన్నుల్లో అధిక శాతం హైదరాబాద్ నుంచే వస్తాయని, వాటిని ఇతర జిల్లాల్లో ఖర్చు చేస్తారు కదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ను తెలంగాణ జీవరేఖగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ది అత్యంత కీలకపాత్ర అని పొగుడుతుంటారు. మరి ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకమని ఎందుకు చెప్పడం లేదు? తెలంగాణ ఆర్థిక ప్రగతిని, దేశానికి చేస్తున్న సేవను ఎందుకు ప్రపంచానికి చెప్పడం లేదో ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
రాజీనామా.. మంత్రి జోక్
ఆయుష్మాన్ భారత్ పథకంపై కేంద్ర మంత్రి చేసిన అసత్య ప్రచారాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఖండిస్తూ.. ‘రాజీనామా’ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మల సీతారామన్ స్పందిస్తూ రాజీనామా చేయాలా? ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువని నిర్మల ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు నిర్ణయించినదాని ప్రకారం ఆమె ఓడిపోయి ఇంటికి పరిమితం కావాలని, మరి కేంద్ర మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు.
నిర్మల పచ్చి అబద్ధాలు..
తెలంగాణపై వివక్ష లేదు: అదే నిజమైతే కేంద్రం నుంచి వివిధ పథకాలు, సిఫారసుల కింద రాష్ర్టానికి రావాల్సిన రూ.34,149 కోట్లు ఎందుకు ఇవ్వలేదు?
ఒకరికి ఎక్కువ.. ఒకరికి తక్కువ అని చూడం: కేంద్రం ప్రకటించే ప్రాజెక్టుల్లో అత్యధిక శాతం గుజరాత్కు, ఉత్తరప్రదేశ్కు ఎందుకు వెళ్తున్నాయి? ఉదాహరణకు.. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే అందులో మేజర్ వాటా యూపీకే ఎందుకు వెళ్లింది?
సెస్ల నిధులన్నీ రాష్ర్టాలకే ఖర్చు: ఆర్థిక సంఘం నిర్ధారించిన సూత్రం మేరకు కేంద్ర ప్రభు త్వం పన్నుల్లో వాటాలను రాష్ర్టాలకు పంచుతుంది. కానీ.. సెస్సు ల ద్వారా వచ్చే డబ్బును ఏ రాష్ర్టానికి ఎంత ఖర్చు చేయాలన్నది కేంద్రం ఇష్టం. సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న లక్ష ల కోట్లను బీజేపీ పాలిత రాష్ర్టా ల్లో వసతులకు ఖర్చు చేస్తున్నది.