గద్వాల, ఏప్రిల్ 1: బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని కోరుతూ సుమారు వందమంది మహిళా రైతులు శనివారం పాదయాత్ర చేపట్టారు. ధరూర్ మండలం నెట్టెంపాడ్, నాగర్దొడ్డి గ్రామాలకు చెందిన మహిళా రైతులు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్దకల్ మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గెలువాలని స్వామి వారిని వేడుకున్నట్టు చెప్పారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయని అన్నారు. అన్నదాత సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, పుష్కలంగా సాగునీరు అందిస్తుండటంతో పంటలు కళకళలాడుతున్నాయని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మల్దకల్ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఎంపీపీ రాజారెడ్డి, బీఆర్ఎస్ మల్దకల్ మండల అధ్యక్షుడు వెంకటన్న.. పాదయాత్రగా వచ్చిన మహిళలకు ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం మహిళలను శేషవస్త్రంతో సత్కరించారు.