హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబాట వేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.6,338.16 కోట్లలో 11 శాతం పెట్టుబడి పెట్టింది. పెట్టుబడిపై రూ.20 కోట్ల వ్యాట్ రీయింబర్స్మెంట్, యూరియా విక్రయాలపై ఏడేండ్లపాటు 100 శాతం, ఐదేండ్లు విద్యుత్తు చార్జీల రీయింబర్స్మెంట్ ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు సొంతంగా రూ.199 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ.154.04 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.44.95 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వనున్నది. రాష్ట్ర ప్రభుత్వ అండతో ఏర్పాటయిన సంస్థ గత ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించగా, ఇప్పటి వరకు 10,17,512 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు సంస్థ రూ.67 కోట్ల లాభాలను ఆర్జించింది.
ఉద్యమ సమయంలోనే హామీ
ఉమ్మడిరాష్ట్రంలో 31 డిసెంబర్ 1999లో నష్టాల కారణంగా రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడగా, దాన్ని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే చొరవ తీసుకొన్నారు. పలుమార్లు రాష్ట్ర ఎంపీలు, అధికారులు కేంద్రంతో చర్చలు జరిపారు. కంపెనీ పునఃప్రారంభానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) 2015 ఫిబ్రవరి 17న రోజుకు 2,200 టన్నుల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత అమ్మోనియా యూనిట్, రోజుకు 3,850 టన్నుల సామర్థ్యంగల యూరియా ప్లాంట్ ఏర్పాటయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎఫ్సీఐఎల్) తదితర కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పారు. ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్లకు 26 శాతం చొప్పున, ఎఫ్సీఐఎల్, 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం మరో 11 శాతం వాటాతో ఏర్పాటుచేశారు. ఆర్ఎఫ్సీఎల్ దాని ప్రమోటర్లు, పెట్టుబడిదారుల నిర్ణయం మేరకు మిగిలిన 26 శాతం పెట్టుబడితో గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఇందులో భాగస్వామిగా చేరింది. యూరియా తయారీకి అవసరమయ్యే గ్యాస్ను మల్లవరం నుంచి ఎరువుల తయారీప్లాంటు వరకు సరఫరా చేసేందుకు అవసరమైన పైప్లైన్ ఏర్పాటునకు ఆర్ఎఫ్సీఎల్ 2016 జూలై 8న టీఎస్పీఎల్ ఇండియా ట్రాన్స్కో లిమిటెడ్(జీఐటీఎల్)తో ఒప్పందం చేసుకొన్నది.
యూరియాలో 50 % రాష్ట్ర అవసరాలకే
రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ పునరుద్ధరణకు అవసరమయ్యే భూసేకరణకు చర్యలు తీసుకోవడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.199 కోట్లు కేటాయించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా ఒక టీఎంసీ నీటి సరఫరా కోసం పైప్లైన్ను ఏర్పాటుచేసింది. కర్మాగారానికి 40 మెగావాట్ల విద్యుత్తును కేటాయించడంతోపాటు అవసరమైన కేబుళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. యూరియా రవాణాకు అవసరమైన అప్రోచ్ రోడ్లను ఏర్పాటుచేసింది. విద్యుత్ చార్జీలు, వ్యాట్, స్టాంప్డ్యూటీపై రాయితీ కల్పించింది. టీ-ఐడియా పథకం మార్గదర్శకాల ప్రకారం పెట్టుబడి వ్యయంలో రాయితీలు ఇచ్చింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో 50 శాతం రాష్ట్ర అవసరాలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకొన్నది. ఫలితంగా గత ఏడాది మార్చి 22 నుంచి యూరియా సరఫరా ప్రారంభమైంది.