జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలు మరోసారి మెరిశాయి. జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో మన గ్రామాలకు అవార్డుల పంట పండింది. కేంద్ర సర్కారు ప్రకటించిన దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో 13 మనకే దక్కాయి. కేసీఆర్ మానసపుత్రిక ‘పల్లె ప్రగతి’తో మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ (డీడీయూపీఎస్వీపీ) 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ విశేష్ పంచాయత్ పురస్కార్, ప్రత్యేక క్యాటగిరీల్లో మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణ రాష్ర్టానికే దక్కాయి. మొత్తం అవార్డుల్లో 30 శాతం దక్కొంచుకొని రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.మొత్తం 9 క్యాటగిరీల్లో కేంద్ర సర్కారు అవార్డులు ప్రకటించగా, తెలంగాణలోని పలు పంచాయతీలు 8 అవార్డులను దక్కించుకొన్నాయి. నాలుగు క్యాటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలు మొదటి, రెండోస్థానంలో నిలిచాయి. ఈ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులను ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు విజయ్కుమార్ బెహ్రా పేర్కొన్నారు.
బోల్తాపడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్!
డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలకు డీడీయూపీఎస్వీపీ అవార్డులు అందనంత దూరంలో నిలిచాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. అవార్డుల లిస్టులో మరో బీజేపీపాలిత రాష్ట్రమైన కర్ణాటక పేరు కనిపించలేదు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 20 కోట్లకుపైగా జనాభా ఉన్న బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క అవార్డుతో సరిపెట్టుకొన్నది. అది కూడా మూడో ర్యాంకులో అవార్డును దక్కించుకొన్నది. కాంగ్రెస్పాలిత రాజస్థాన్కు ఒక్క అవార్డు కూడా లభించలేదు. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శమని చెప్పుకొనే కేరళ రాష్ర్టానికి మనకు దక్కినన్ని అవార్డుల్లో సగం కూడా దక్కలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లాంటి రాష్ర్టాలకు అవార్డులే దక్కలేదు.
ఫస్ట్ ర్యాంక్ సారథులంతా మహిళలే
జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణలోని నాలుగు గ్రామాలకు నలుగురు మహిళా సర్పంచ్లే ఉండటం విశేషం. గౌతమ్పూర్, నెల్లుట్ల, కొంగట్పల్లి, ఐపూర్ గ్రామాలు మొదటి ర్యాంకులు సాధించాయి. వీటిలో గౌతమ్పూర్కు పీ సుజాత, నెల్లుట్లకు చిట్ల స్వరూపారాణి, హన్వాడకు అసిరెడ్డిపల్లి మానస, ఐపూర్కు సానబోయిన రజిత సర్పంచ్గా ఉన్నారు. వీరు ఈ నెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.
నగదు అవార్డు ఎంతంటే?
కేంద్ర సర్కారు జాతీయ పంచాయతీ అవార్డులను ఈ నెల 17న ప్రదానం చేయనున్నది. రాష్ట్రపతి చేతులమీదుగా నగదు బహుమతితోపాటు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. మొదటి ర్యాంకు సాధించిన ఒక్కో పంచాయతీకి రూ.50 లక్షలు, రెండో ర్యాంకు సాధించిన పల్లెలకు రూ.40 లక్షలు, మూడో ర్యాంకు సాధించిన పంచాయతీలకు రూ.30 లక్షల చొప్పున ఇవ్వనున్నది. ప్రత్యేక క్యాటగిరీలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి రూ.50 లక్షలు, కన్హాకు రూ. 70 లక్షలు అందించనున్నది. ఉత్తమ మండల పరిషత్ క్యాటగిరీలో జాతీయస్థాయిలో రెండో స్థానం సాధించిన తిమ్మాపూర్కు రూ.75 లక్షలు, ఉత్తమ జిల్లా పరిషత్ క్యాటగిరీలో రెండో ర్యాంకు సాధించిన ములుగు జిల్లా పరిషత్కు రూ.3 కోట్ల నగదును అందజేయనున్నది.
అన్నింటా తెలంగాణ ప్రథమం
తెలంగాణ రాష్ట్రం గత కొన్నేండ్లుగా అన్ని విభాగాల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నది. కేంద్ర సర్కారు ఏ అవార్డులు ప్రకటించినా తెలంగాణకే అత్యధికం దక్కుతున్నాయి. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రంగా ఇప్పటికే ఘనత సాధించింది. మిషన్ భగీరథకు కేంద్ర సర్కారు అవార్డు దక్కింది. తెలంగాణలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఓడీఎఫ్ ప్లస్లోనూ 100 శాతం లక్ష్యం చేరిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం స్వయంగా ప్రకటించింది. గతంలో ఈ-పంచాయతీ అవార్డుల్లోనూ రాష్ట్రం మెరిసింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా జాతీయస్థాయిలో టాప్ 20 గ్రామాల్లో టాప్ 19 గ్రామాలు మన తెలంగాణవే కావడం విశేషం. రూర్బన్ అమలులోనూ దేశంలో తెలంగాణ అగ్రస్థానం దక్కించుకొన్నది. గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపుతోపాటు పంచాయతీ నిధుల ఆన్లైన్ ఆడిటింగ్లోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
‘పల్లె ప్రగతి’తోనే అవార్డుల పంట
తెలంగాణలో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతోపాటు కఠిన నిబంధనలు రూపొందించారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాల్సిందేనని చట్టంలో పొందుపర్చారు. దీంతో ప్రతి పల్లె నందనవనంగా మారింది. పల్లెల సమగ్రాభివృద్ధి కోసం 2019 సెప్టెంబర్ 6 నుంచి ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ ఐదు విడతలుగా పల్లె ప్రగతి నిర్వహించారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ షెడ్ ఏర్పాటుతోపాటు పంచాయతీ కార్యదర్శిని నియమించారు.
కేంద్ర ప్రభుత్వంతో సమానంగా నిధులను విడుదల చేస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి పార్టీకి చెందిన వారు ప్రాతినిధ్యం వహించే గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి గ్రామానికి నిధులను విడుదల చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ సమకూర్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.256 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నది. ఇందులో 85 శాతం గ్రామాలకు, 10 శాతం మండల పరిషత్లు, 5 శాతం జిల్లా పరిషత్లకు ఖర్చు చేస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీలకు కనీస మొత్తం రూ.5 లక్షలు విడుదల చేయాలనే సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రలోని 297 గ్రామ పంచాయతీలకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నారు. దీంతో తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు అన్ని విభాగాల్లోనూ అభివృద్ధిబాటపట్టాయి. కేంద్రం ప్రకటించిన అవార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పల్లె ప్రగతి వల్లే : కేటీఆర్
సీఎం కేసీఆర్ మానసపుత్రిక పల్లె ప్రగతి వల్లే జాతీయస్థాయిలో తెలంగాణ మరోసారి మెరిసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్, ఉత్తమ గ్రామ పంచాయతీల్లో నెంబర్ వన్, ఓడీఎఫ్ ప్లస్ 100 శాతం సాధించిన గ్రామాల్లోనూ తెలంగాణ పల్లెలు నంబన్ వన్ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఇందుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.
కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం: హరీశ్రావు
జాతీయస్థాయిలో తెలంగాణకు పంచాయతీరాజ్ అవార్డులు దక్కడం సీఎం కేసీఆర్కు గ్రామీణాభివృద్ధి పట్ల ఉన్న ముందు చూపునకు నిదర్శనం అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ విజయానికి ఇది దర్పణం అని వ్యాఖ్యానించారు. నాలుగు క్యాటగిరీల్లో మొదటి ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.
సత్తాచాటిన తెలంగాణ పల్లెలు: గంగుల కమలాకర్
కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే ఈ అవార్డులు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన తిమ్మాపూర్ మండలం ఉండటం సంతోషకరమన్నారు.
పల్లెప్రగతి ఫలాలివి
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లెప్రగతి కార్యక్రమం ద్వారానే ఈ అవార్డులు సాధ్యం అయ్యాయి. నిరంతరం కృషి చేసిన సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ అభినందనలు. పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు బృందానికి కంగ్రాట్స్. అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అవార్డులు రాని గ్రామాలు వచ్చే ఏడాది అవార్డులు వరించేలా పనిచేయాలి.
-ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి