హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామాను సోమవారం ఆయన కలిసి ఆహ్వానించారు.
2006లో బుద్ధవనంలో దలైలామా బోధి మొక్క నాటగా, అది ప్రస్తుతం వృక్షంగా మారగా, ఆ ఫొటోలు, బుద్ధవనం జ్ఞాపికను దలైలామాకు అందజేశారు. బుద్ధవనంలోని అపురూప శిల్పాల విశిష్టతలను డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఆయన రాసిన ‘బుద్ధిస్ట్ ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ’ పుస్తకాన్ని దలైలామాకు బహూకరించారు. బుద్ధవనాన్ని సందర్శించేందుకు దలైలామా సానుకూలత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధీర్రెడ్డి, సలహా మండలి సభ్యులు ఆచార్య సంతోష్, కేకే రాజం, రామకృష్ణంరాజు పాల్గొన్నారు.