హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని రాతిబండపై చెక్కిన ‘తొలుచువాండ్రు’ను తొలి తెలుగు శాసనంగా గుర్తించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పురావస్తుశాఖకు విజ్ఞప్తిచేసింది. పెద్ద బండరాయిపై 80-85 సెంటీమీటర్ల పొడవు, 180 సెంటీమీటర్ల వెడల్పున చెక్కి వున్న ఐదు అక్షరాలు లిపి పరంగా క్రీ.శ.5వ శతాబ్దానికి చెందినవని పేర్కొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ 1981-82 వార్షిక నివేదికలో వీటిని ‘తొలుచువాండ్రు’గా ప్రకటించిందని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. అయినప్పటికీ ఈ లేఖనాన్ని తొలి తెలుగు శాసనంగా పురావస్తుశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు. ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.