ములుగురూరల్: వంట పొగ చూరితే ఒళ్లు గుల్ల అయితది. ఆడోళ్ల పానం కరాబ్ అయితది. అందుకే కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలె. సిలిండర్ వాడాలి.. మొన్నటి దాకా సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తుండటంతో కొనుక్కొనేటోళ్లు. కేంద్రంలో బీజేపీ వచ్చినంక సిలిండర్ ధర పెరగడం, సబ్సిడీ ఎత్తేయడంతో పేదలకు సిలిండర్ మోయలేని భారంగా మారింది. ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని మదనపల్లి గ్రామంలో నెల రోజులుగా మంతపూరి మిరియమ్మ కట్టెల పొయ్యిపై అన్నం వండుకొంటున్నది. కిలోమీటర్ దూరం ఉదయం 7 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి బాట పడుతున్నది. అటుగా వెళ్లిన ‘నమస్తే’తో తన బాధను చెప్పుకొంది. తన భర్తకు సీఎం కేసీఆర్ ఇచ్చే రూ.2 వేల ఆసరా ఫించనే తమకు ఆధారమని పేర్కొన్నది. తన తల్లి కూడా తమతోనే ఉంటున్నదని చెప్పింది. ఇంట్లో వంట గ్యాస్ ఉన్నా సిలిండర్ నింపుకొనేంత డబ్బులు తన దగ్గర లేవని, వచ్చే పింఛన్లో రూ.1150 గ్యాస్కే పోతే ఏం తిని బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే గ్యాస్ పొయ్యిని మూలకు పడేసి కట్టెలు తీసుకెళ్తున్నానని తెలిపింది. –