ఆయన నిజాం రాజవంశపు యువరాజు. బ్రిటిషర్లకు లొంగి పనిచేస్తే రాజభోగాలు అనుభవించేవాడు. కానీ, బ్రిటిషర్ల అరాచకత్వంపై బాణం సంధించాడు. తెల్లవాళ్ల ఆధిపత్యంపై తిరుగులేని పోరాటం చేశాడు. సింహాసన వారసత్వంతోపాటు జీవితాన్నే ఫణంగా పెట్టాడు ముబారిజుద్దౌలా.
ముబారిజుద్దౌలా అసలు పేరు మీర్ గోహర్ అలీఖాన్. బ్రిటిష్ వ్యతిరేకి. 1815లో షిరీన్ అనే ముబారిజుద్దౌలా సేవకునికి రెసిడెన్సీ బజార్లోని ఓ దర్జీతో గొడవ జరిగింది. షిరీన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అతడు ముబారిజుద్దౌలా శరణు వేడాడు. ముబారిజ్.. ఆ దర్జీని తన మనుషుల ద్వారా అదుపులోకి తీసుకుని తన దివాణానికి రప్పించాడు. దర్జీ ఉండేది తన పరిధిలోకి వచ్చే రెసిడెన్సీ ప్రాంతం కనుక బ్రిటిష్ రెసిడెంట్ రసెల్ ఈ వ్యవహారంపై ఆసక్తి చూపాడు. యువరాజుతో ముడివడిన వ్యవహారం కనుక దివాన్ మునీరుల్ ముల్క్ ఏదో ఒకటి చేస్తానని రెసిడెంట్కు సర్ది చెప్పాడు. కానీ రెసిడెంట్ ఊరుకోలేదు. ముబారిజుద్దౌలా ఇంటి మీదకు వెయ్యిమంది సైన్యాన్ని రెండు శతఘ్నులను పంపాడు. ముబారిజుద్దౌలా మనుషులు ప్రతిఘటించారు.ఈ ఘర్షణలో ముబారిజ్ వేసిన బాణం తగిలి ఓ ఇంగ్లిష్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. యువరాజు దగ్గర పనిచేసే ఆఫ్రికా సైనికుడు జరిపిన కాల్పులకు రెసిడెంట్ పంపిన సైన్యాలు పరుగు లంకించుకున్నాయి. రెసిడెంట్కు ఈ వ్యవహారం బాగా కోపం తెప్పించింది. మరో 800 మంది సైనికులను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రప్పించేందుకు ఆదేశాలిచ్చాడు.
పేష్కార్గా ఉన్న మహారాజా చందూలాల్ దౌత్యం నడిపాడు. ముడుపులు ముట్టజెప్పి సర్దుబాటు చేసినా..ముబారిజుద్దౌలాను గోల్కొండ కోటలో ఐదేళ్లపాటు నిర్బంధంలో ఉంచారు. నిజాం ఇందుకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
విడుదలైన తర్వాత ముబారిజుద్దౌలా 1829లో హైదరాబాద్లో బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు జరిపాడు. అప్పడు ముబారిజ్ అన్న నాసిరుద్దౌలా నిజాం. ముబారిజ్.. అరబ్లు, అఫ్గాన్లను పోగు చేశాడు. ఈ తిరుగుబాటును అణిచేందుకు బ్రిటీష్ దళాలు మరోసారి నగరంలోకి ప్రవేశించాయి. 1830 ఏప్రిల్ 19న ముబారిజుద్దౌలాను అరెస్టు చేసి గోల్కొండలో బంధించారు. కోట దగ్గర ఉండే సైనికులను తనవైపు తిప్పుకుని కోటలోని ఖజానా చేజిక్కించుకునేందుకు ముబారిజ్ ప్రయత్నించాడు. బొల్లారం నుంచి మరోసారి బ్రిటిష్ సైన్యాలు రంగంలోకి దిగడంతో ముబారిజ్ తన తిరుగుబాటు విరమించి నగరానికి తిరిగి వచ్చాడు.
ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్ కూడా వేశారు. ఆ ప్రకారమే ముబారిజుద్దౌలాను గోల్కొండలో నిర్బంధించారు. 1851లో ముబారిజ్ గోల్కొండ కోటలో కన్నుమూశాడు.
వహాబీ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా..
హైదరాబాద్లో వహాబీ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా ముబారిజ్ మారాడు. 1839లో వహాబీ కార్యకలాపాలపై చర్యకు జనరల్ ఫ్రేజర్ ఉపక్రమించాడు. ముబారిజుద్దౌలాను, అతని అనుయాయులను నిర్బంధించి నేర నిర్ధారణకు విచారణ కమిషన్ నియమించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముబారిజ్ దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని రెసిడెంట్ ఆరోపించాడు. కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశముందని, పై అధికారులకు సిఫారసు చేశాడు. దీంతో నిజాం తన సొంత తమ్ముణ్ణి అయిష్టంగా మరోసారి గోల్కొండలో నిర్బంధించేందుకు సిద్ధమయ్యాడు.