తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కావటం లేదని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దమ్ముంటే అమిత్ షాను ఒప్పించి ఈ పథకాలను ఆ రాష్ర్టాల్లో అమలు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, వారిని రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులు చేసేదేమీ ఉండదని మండిపడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రైతుల ధాన్యాన్ని కొనలేని కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారని నిలదీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 1965లో ఎఫ్సీఐని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వానకాలంలో రా రైస్, వేసవిలో బాయిల్డ్ రైస్ కొంటున్న ఎఫ్సీఐ.. ఈ ఏడాది మాత్రం అడ్డంకులు ఎందుకు సృష్టించిందని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వికట పరిహాసం చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. ప్రజల్లో భ్రమలు కల్పించడానికే అమిత్షా, నడ్డా ఇక్కడికి వస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విషం చిమ్మడానికి వరుసకట్టి వస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం సహకరించకున్నా ఉన్న వనరులతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ ఓపెన్ చాలెంజ్ చేశారని, కానీ ఇంతవరకూ సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర హోం మంత్రి అమిత్షా తోక ముడిచారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏమిస్తారో చెప్పకుండా అక్బర్, బాబర్, నిజాం అంటూ పిచ్చికూతలు కూశారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్షా ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేందుకే పరిమితమైందని విమర్శించారు.
తెలంగాణకు కేంద్రం చేసిందేమిటన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్షా పనికిమాలిన ముచ్చట్లు, పచ్చి అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. పిచ్చి ఒర్రుడు కాదు- కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేయడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్న బీజీపీకి టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజాం, రజాకార్ అనే పదాలు తప్ప బీజేపీ నేతలకు ఏమీ రావని టీఎస్ఈఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఎద్దేవాచేశారు.తుక్కుగూడ వేదికపై ఉన్న నేతల్లో తొంభై శాతం మంది ఔట్ డేటెడ్ అని, ప్రజల చేత పలుమార్లు తిరస్కరణకు గురయ్యారని చెప్పారు. 30 వేల మంది కూడా పట్టని సభా ప్రాంగణాన్ని నింపలేక అమిత్షా రాకను ఆలస్యం చేశారని దెప్పి పొడిచారు.