న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే సిట్ సేకరించిన ఆధారాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టులో వాదించారు. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దుశ్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. నిందితులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని, అనేక కీలక ఆధారాలను సేకరించిందని చెప్పారు.
సిట్ను సింగిల్ జడ్జి రద్దు చేశారని, ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసిందని, ఇప్పటి వరకు సీబీఐ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లలేకపోయిందని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. సిట్ మనుగడలో ఉన్నదా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలు ఏమిటని ఆరా తీశారు. దవే స్పందిస్తూ.. హైకోర్టు తీర్పు తర్వాత కేసు దర్యాప్తులో వీసమెత్తు పురోగతి లేదని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర జరిగిందని, ప్రజాస్వామ్య పునాదిపై దాడికి ప్రయత్నం జరిగిందని వెల్లడించారు.
సిట్ దర్యాప్తును కొనసాగిస్తేనే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బట్టబయలు అవుతుందని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ప్రతివాదన చేస్తూ.. సీఎం స్వయంగా కీలక ఆధారాలను మీడియాకు లీక్ చేశారని, అందువల్ల సీబీఐ దర్యాప్తు ఉండాలని తెలిపారు. దవే కల్పించుకొని.. అనేక కేసుల దర్యాప్తుల గురించి మీడియాలో వస్తున్నాయని, అంతమాత్రాన దర్యాప్తు లీక్ అయినట్టు కాదని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, ఆరోపణలు బీజేపీ నేతలపైనే ఉన్నప్పుడు తిరిగి సీబీఐ దర్యాప్తు ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
సుమారు 5 గంటల పాటు ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహార వీడియో పుటేజీ, టెలిఫోన్ రికార్డింగ్స్, వాట్సాప్ మెసేజ్లను సిట్ సేకరించిందని, ఇన్ని ఆధారాలను సేకరించిన సిట్.. కేసును సీబీఐకి ఎందుకు బదిలీ చేయాలని ప్రశ్నించారు. నిందితులు, వాళ్లకు మద్దతు తెలుపుతున్న బీజేపీ నేతలు కోరుకొనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించటం అన్యాయమని అన్నారు. నిందితులు దర్యాప్తు సంస్థను ఎంచుకునే హకు ఉండదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో అనేక కీలక విషయాలను వివరించేందుకు మరింత సమయం కావాలని దవే కోరగా.. ఈ నెల 27న సమగ్ర వాదనలను వింటామని, ధర్మాసనం విచారణను వాయిదా వేయింది.