హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంఎన్ఆర్ఈజీఎస్ 8వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీకి అధ్యక్షత వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పారలు, గడ్డపారలు, గంపలు ఇచ్చేవారని, రానురాను వాటిని ఆపేశారని తెలిపారు. మళ్లీ ఆ పనిముట్లతోపాటు మెడికల్ కిట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు 10.66 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని తెలిపారు. ఈసారి 12 కోట్ల పనిదినాలు కావాలని అడిగితే కేంద్రం అనేక షరతులు పెట్టి 11 కోట్ల పనిదినాలకు అనుమతి ఇచ్చిందని చెప్పారు.
గ్రామాల్లో గొర్రెల కాపరులు షెడ్లు వేసుకునేందుకు ప్రభుత్వమే స్థలాలను చూపేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేయాలని మంత్రులు కోరారు. ఉపాధి పథకంలో భాగం గా వ్యవసాయ కల్లాలు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని కేంద్ర ప్రభుత్వం.. ఆ పనులు పూర్తయ్యాక తప్పుపట్టడం విడ్డూరంగా ఉన్నదని నిప్పులు చెరిగారు. ఈ పథకం కింద తెలంగాణకు రావల్సిన రూ.800 కోట్లను కేంద్రం 10 నెలలుగా నిలిపివేసిందని, కల్లాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.150 కోట్లను మినహాయించుకుని మిగిలిన నిధులను విడుదల చేయాలని అడిగితే ఇటీవల రూ.276 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇంకా కేంద్రం నుంచి రూ.250 కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఉపాధి హామీకి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,135 కోట్లు ఖర్చు చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హన్మంతరావు వెల్లడించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సు తీసుకొన్న వారికి 4 క్రెడిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలపై అభిప్రాయాలను ఈ నెల 22 లోపు తెలుపాలని సూచించింది.