అమీర్పేట, నవంబర్ 18: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాటిన మొక్కను తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆ మహనీయుడు 1994లో నాటిన ఈ మొక్క.. నేడు మహా వృక్షమైందని తెలిపారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని ఆయన్ను ఎన్నటికీ మరువనని చెప్పారు. సనత్నగర్ మోడల్కాలనీలో శనివారం ఎస్ఆర్నగర్ కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన మహోత్సవంలో తలసాని పాల్గొని మాట్లాడారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, వ్యక్తిగత కక్షలకు కారణం కాకూడదని అన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో అక్కడి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తలసాని తీవ్రంగా ఖండించారు.
ప్రజలు అప్పగించిన బాధ్యతను ప్రజా ప్రయోజనాలకు తప్ప వ్యక్తిగత స్వార్థాలకు వినియోగంచరాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. నాలుగైదు దశాబ్దాల నుంచి హైదరాబాద్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వారంతా ఇక్క డి వారేనని చెప్పారు. వారికి ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోవడానికి తాను ముందు వరుసలో ఉంటానని 2014లో ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నానని తెలిపారు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందని రాజకీయంగా సత్యదూరమైన వ్యాఖ్యలతో ఇక్కడ నివాసమేర్పర్చుకున్న వారిని భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలు అనేకం జరిగాయ ని, వాటన్నింటికీ సీఎం కేసీఆర్ తనదైన పాలనతో సమాధానమిచ్చారని తెలిపారు.
అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కు సహకరిస్తానని తలసాని తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని మోతీనగర్, మూసాపేటలో ఆ మహనీయుని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు అడ్డుకోవడాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరించానని గుర్తుచేశారు. కార్యక్రమంలో కమ్మవారి సేవా సమితి ప్రతినిధులు కొత్తపల్లి మధుసూదన్రావు, రాజారావు, నరేందర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.