హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి అనేక రంగాల్లో రోల్ మోడల్గా నిలుస్తూ, మరెన్నో రంగాల్లో దిక్సూచిగా ఉంటోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తాజాగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కేంద్ర ప్రభుత్వం కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి, వారికి రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రధానమైనదని ఆమె చెప్పారు.
కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి, వారికి రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించిందని, అంగన్వాడీలకు మాత్రం ఈ బీమా సదుపాయం కల్పించలేదని మంత్రి సత్యవతి తెలిపారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా ఈ రూ.50 లక్షల బీమా వసతి కల్పించాలని కోరుతూ 2021 జూన్ 23న కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.
అనంతరం సెప్టెంబర్ 3న కూడా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ప్రత్యేకంగా కలిసి అంగన్వాడీలకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గత నాలుగు నెలలుగా తాము చేస్తున్న కృషి ఫలితంగానే కేంద్రం అంగన్వాడీలకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించిందని, ఇది సంతోషదాయకమైన విషయమని అన్నారు. ఇందుకు కేంద్రానికి, ముఖ్యంగా కేంద్రమంత్రి శ్రీమతి స్మృతి ఇరానీకి కృతజ్ఞతలు తెలిపారు.