హైదరాబాద్: ఫ్రెంచ్ సెనేట్లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. ఆయన ప్రసంగానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభించింది. సభికులు కరతాళ ధ్వనులతో స్పందించారు. ఇవాళ పారిస్లోని ఫ్రెంచ్ సెనేట్లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కొవిడ్ అనంతరం ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం అనే అంశంపై మంత్రి మాట్లాడారు.
గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం, అనుమతులు అందించడం, సుశిక్షితులైన మానవ వనరులను పొందడంలో కంపెనీలకు సహాయం చేయడం, వనరుల సేకరణ వంటి బహుళ కార్యాచరణ అంశాలలో గణనీయమైన స్వయంప్రతిపత్తిని పెంచుకుంటాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ గురించి మంత్రి కేటీఆర్ సెనేట్ వేదికగా ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్ కంపెనీలకు, ముఖ్యంగా ఎస్ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ను అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉందని చెప్పారు.