హైదరాబాద్: ఇవాళ ఫ్రెంచ్ సెనేట్లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరమ్లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. టీఎస్ ఐపాస్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ-ధృవీకరణను అనుమతిస్తుందని చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుందన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతులు రాకపోతే 16వ రోజున, పూర్తి అనుమతులు లభించి ఆమోదించబడినట్లు పరిగణించబడుతుందన్నారు.
తెలంగాణకు TSIICలో దాదాపు 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యుత్, నీటి వసతితోపాటు ఉత్తమ మౌలిక సదుపాయాలున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను మంత్రి కేటీఆర్ హైలైట్ చేస్తూ.. ప్రభుత్వం తన సొంత ఖర్చులతో అవసరమైన వారికి శిక్షణనిస్తుందని, వారిని నాణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్నదని మంత్రి తెలిపారు.
దీని ద్వారా స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి చెప్పారు. ఏ కంపెనీ అయినా భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఇతర రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్న అంశాలను ప్రస్తావించగలిగితే, మేము వారి ఆఫర్ను బీట్ చేస్తామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.