హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రైస్తవ కుటుంబాలకు నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లలోని అతి బీద కుటుంబాలకు 2.25 లక్షల చీరలు పంపిణీ చేయాలని సూచించారు.
డిసెంబర్ మొదటి వారంలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయాలని TSCO అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హెచ్ఎం నదీమ్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏకే ఖాన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎమ్డీ కాంతి వెస్లీ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ కాసిం, TSCO జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.