TS Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. పైసలకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. నమ్ముకున్న వారిని మోసగిస్తున్నదన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠా తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయన మంచి నాయకుడని కొనియాడారు. చాలా ఏండ్లుగా మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేయడానికి బీఆర్ఎస్ లోకి వచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని హరీశ్ రావు అన్నారు. కంఠా తిరుపతి రెడ్డితోపాటు మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఏ పార్టీకి బీఆర్ఎస్ బీ టీం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల టీఎం అని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు.
ఇంకా చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారని హరీశ్ రావు చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ఇంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశించడం హాస్యాస్పదం అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టికెట్లు ఖరారు చేస్తే గందరగోళంలో పడతామనే అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని తేల్చి చెప్పారు.