సిద్దిపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్, బీజేపీ నేతలను రాజగోపాల్పేట చెరువులో ముంచితే.. చెరువులోకి కాళేశ్వరం నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణలో కరెంట్ సరఫరాపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘మోసేటోళ్లకు బరువు.. పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది. ఢిల్లీలో, గాంధీభవన్లో కూసుండి మాట్లాడేటోళ్లకు ఏం తెలుస్తది’ అని పేర్కొన్నారు. సిద్దిపేటతోపాటు సిద్దన్నపేట గ్రామంలో మంత్రి హరీశ్రావు బుధవారం ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. నంగునూరు మండలం రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక బోర్డు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని గుర్తుచేశారు. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయని, కూలీలు దొరకడం లేదని అన్నారు. బీహార్ నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదని ఎద్దేవాచేశారు. వారిని తీసుకొచ్చి రాజగోపాల్పేట చెరువులో ముంచితే కాళేశ్వరం జలాలు కనిపిస్తాయని అన్నారు.
నాడు కాంగ్రెస్ పుర్రెగుర్తు తెచ్చింది
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీడీలపై పుర్రెగుర్తు తెచ్చిందని, ఇప్పుడు బీజేపీ 28 శాతం జీఎస్టీ మోపి బీడీ పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టిందని హరీశ్రావు విమర్శించారు. 16 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. అక్కడ రూ.2 వేల పింఛన్, రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తే చెప్పాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చినమాట ప్రకారం పింఛన్ను రూ.2016కు పెంచి అందిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో పింఛన్ రూ.75 ఇచ్చేవారని, ఎవరైనా చనిపోతేనే మరొకరికి పింఛన్ వచ్చేదని, ఇక కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛన్ కొంతమందికే వచ్చేదని మంత్రి గుర్తుచేశారు.
తిన్నరేవు తలవాలి
కాంగ్రెస్ హయాంలో చెరువుల్లో నీళ్లు ఇంకిపోయేవని, బోర్లు వేసి, మోటర్లు పెట్టి వ్యవసాయం చేసేవారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు.ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పనిలేకుండా చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. తిన్నరేవు తలవాలని.. మీరంతా సీఎం కేసీఆర్ సార్కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరుల్లో వందశాతం సబ్సిడీతో చేపపిల్లలు వదిలి మత్స్యకారులకు ఉపాధి చూపుతున్నట్లు తెలిపారు. మత్య్యకారులకు చేపల మార్కెటింగ్, చేపల రవాణాకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం రాయితీలపై వాహనాలు అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు.