హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మానవీయతో కూడిన పాలన అందించడం సీఎం కేసీఆర్ పాలనా ముఖ్యలక్షణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 57 ఏండ్ల వయసు నిండినవారికి, డయాలసిస్ రోగులకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి పింఛన్లు ఇస్తున్నామని ప్రకటించారని గుర్తుచేశారు. 10 లక్షల కొత్త పింఛన్లతోపాటు అనాథ పిల్లలను సర్కారు బిడ్డలుగా స్వీకరించి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు.
అందుకే నీతిఆయోగ్ సమావేశం బహిష్కరణ
నీతిఆయోగ్ నిరర్థకంగా మారిపోయిందని, అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. ‘సంధి కుదరదని తెలిసీ శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన మహాభారతం నుంచి కేసీఆర్ నేర్చుకోవాల్సింది. ప్రధానమంత్రి, సీఎంల సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతిఆయోగ్ను ప్రశ్నించి ఉండాల్సింది’అని ట్వీట్చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనేది పాత సామెత నాగేశ్వర్గారు. కేంద్రం పక్షపాత, వివక్షాపూరిత మనస్థత్వంతో నీతిఅయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో, నీతి ఆయోగ్లో నీతి కూడా అంతే. అందుకే బహిషరణ ద్వారా అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు’ అని ట్వీట్చేశారు.