HMPV Virus | హ్యుమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ కొత్తదేమీ కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని సోమవారం తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు.
చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోందని దామోదర్ రాజనర్సింహ చెప్పారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు.
రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని దామోదర్ రాజ నర్సింహ చెప్పారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంది. డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుందని దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.