Telangana Minister Raja Narsimha | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని హెచ్ఓడీలు, డీఎంహెచ్ఓలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎలిసా టెస్ట్ (ELISA TEST) బదులు రాపిడ్ టెస్ట్ (RAPID TEST) ద్వారా డెంగ్యూ వ్యాధిని నిర్ధారించి ప్రజలను ఆందోళనలకు గురిచేసే ఆసుపత్రులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
డెంగ్యూ వ్యాధిపై జరుగుతున్న అసత్యపు ప్రచారం పై నిఘా పెట్టాలని మంత్రి దామోదర్ రాజ నర్సింహా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్త నమూనాలను సేకరించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి నీటి నిల్వ కుంటలలో, చెరువులలో ఆయిల్ బాల్స్ లను వెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల్లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ పై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నిర్ధారణకు అన్ని రకాల టెస్టులు, రక్త పరీక్షలు, అవసరమైన మందులు, సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉన్నారని మంత్రి దామోదర్ రాజ నర్సింహా చెప్పారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య శాఖ అధికారులను హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలతోపాటు నర్సింగ్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన అధునాతన ఎక్విప్మెంట్ సమకూర్చాలని తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ వాసుదేవరావును మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు. రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా అవగాహన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోoగ్తూ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవ రావ్ , రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.