హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభణ క్రమంగా పెరుగుతున్నది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 4,207 కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే 650 కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.6 శాతంగా ఉన్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 27 వేలకు చేరువైంది. రికవరీ రేటు 95.75 శాతానికి తగ్గింది. మరోవైపు 1,825 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గురువారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,645, మేడ్చల్ మల్కాజిగిరిలో 380, రంగారెడ్డిలో 336, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107, ఖమ్మంలో 98, పెద్దపల్లి 87లో, వికారాబాద్లో 86, కరీంనగర్, నల్లగొండలలో 84 చొప్పున, మహబూబ్నగర్లో 81, మంచిర్యాలలో 80, యాదాద్రి భువనగిరిలో 78, నిజామాబాద్లో 74, సిద్దిపేటలో 70, సూర్యాపేట, నాగర్ కర్నూల్లలో 52 చొప్పున కేసులు వెలుగు చూశాయి.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3.18 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 71 వేల మందికి మొదటిడోస్, 2.31 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 15 వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. మొదటి డోస్ 103 శాతం మందికి, సెకండ్ డోస్ 78 శాతం మందికి పూర్తయింది. 15-18 ఏండ్ల వారికి ఇప్పటివరకు 56 శాతం మందికి మొదటి డోస్ పంపిణీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36.56 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,640 పడకలు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను ఈ నెల 31 వరకు పొడిగించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.