తెలంగాణ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో సభను వాయిదా వేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటక విధానంపై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. అయితే లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ లగచర్ల రైతుల అంశంపై చర్చకు అనుమతించలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు. దీంతో మండలి చైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ సభ్యులు ధర్నాకు దిగారు.