హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్లో నెలకొల్పాలని డిమాండ్లు వచ్చినప్పటికీ హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని తాను నిర్ణయించినట్టు వెల్లడించారు. డాటా సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్కు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. హైకోర్టులో శుక్రవారం సీజేఐ జస్టిస్ రమణను న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్టు చెప్పారు. ట్రిబ్యునల్ ఏర్పాటైతే ఈ ప్రాంతానికి చెందిన కంపెనీల కేసులు ఇకడే పరిషారమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్లో వాణిజ్యపరమైనవే కాకుండా స్థానిక కేసులు కూడా రాజీ చేసుకొనేందుకు న్యాయవాదులు చొరవ చూపాలని సూచించారు.
జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ఒక అకాడమీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని, హైకోర్టులో వారికి ఒక ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. బార్ కౌన్సిల్ నుంచి ప్రతిపాదన వస్తే తాను పదవీ విరమణ చేసేలోగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. తెలంగాణది పరస్పరం ఫిర్యాదులు చేసుకొనే సంసృతి కాదని చెప్పారు.
తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో కోర్టులు, వాటిలో మౌలిక వసతులపై దృష్టిపెట్టానని జస్టిస్ రమణ తెలిపారు. ఇందులో భాగంగానే న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. కోర్టులో మౌలిక వసతుల కల్పనకు న్యాయ మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు వెల్లడించారు. హైకోర్టు సీజేలు, రాష్ట్రాల అధికారులు ఉండే కార్పొరేషన్ ద్వారా పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలతో సదస్సు జరగనున్నదని, అందులో కార్పొరేషన్పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని చెప్పారు.
దేశవ్యాప్తంగా 1,100 మంది హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల్లో ఎప్పుడూ 400 పోస్టులు ఖాళీగా ఉంటాయని జస్టిస్ రమణ అన్నారు. గత ఏడెనిమిది నెలల్లో 198 మంది పేర్లను న్యాయూమూర్తుల పోస్టులకు ప్రతిపాదిస్తే, 130 వరకు భర్తీ అయ్యాయని తెలిపారు. ఇంకా 60 వరకు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. మే నెలాఖరులోగా మరో 200 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల భర్తీపై సీజే నేతృత్వంలోని కొలీజియం పేర్లను సిఫారసు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జే రామచందర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. పనిచేసిన చోట సన్మానం పొందడం చిన్న విషయం కాదు. ఆ కికే వేరు. ఎన్నో ఏండ్ల్లు నాకు హైకోర్టుతో అనుబంధం ఉన్నది. ఇకడికి రావడమంటే సొంతింటికి వచ్చినట్టు, తల్లి ఒడికి చేరినట్టు ఉన్నది. ఆదరించిన ఆశీస్సులు అందించిన తెలంగాణ గడ్డకు శతకోటి వందనాలు’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టులో 17 ఏండ్లు న్యాయవాదిగా, 13 ఏండ్లకుపైగా న్యాయమూర్తిగా, యాక్టింగ్ సీజేగా పనిచేశానని తెలిపారు. తెలంగాణకు
గొప్ప సంసృతి ఉన్నదని, అందరూ కలిసి పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నారని ప్రశంసించారు.