తెలంగాణలో సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేన్స్ టెక్నాలజీ సంస్థకు అభినందనలు. 2800 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న యూనిట్ ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేన్స్ రాక తెలంగాణకు వ్యూహాత్మక పెట్టుబడి అవుతుంది. తెలంగాణలో సెమికండక్టర్ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ సంస్థ సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.2800 కోట్ల్లు పెట్టుబడి పెడతామని తెలిపింది. ఈ కంపెనీ ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో కేన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ కణ్ణన్, చైర్ పర్సన్ సవిత రమేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీనిని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు చేయనున్నారు.
కేన్స్ సంస్థకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేన్స్ రాక తెలంగాణకు వ్యూహాత్మక పెట్టుబడి అవుతుందని అభిప్రాయపడ్డారు. సెమికండక్టర్ ఎకోసిస్టమ్కు ఆదర్శవంతమైన గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తామని హామీ ఇచ్చారు. కేన్స్ టెక్నాలజీ సీఎండీ రమేశ్ కన్నన్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక ఓఎస్ఏటీ, ఏటీఎంపీ ప్లాంట్ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని చెప్పారు. కొంగరకలాన్లో ఏర్పాటుచేసే యూనిట్ అత్యాధునిక సాంకేతికత, యంత్రాలతో ప్రపంచస్థాయి ప్లాంట్గా ఉంటుందని సవిత రమేశ్ తెలిపారు. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్కు మూడు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగంలో ఉన్న స్వదేశీ సంస్థ ఇది. ఐఐటీ బాంబే సహకారంతో పరిశోధన కోసం కేన్స్ సెమికాన్ అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి, కేన్స్ సెమికాన్ సీఈవో రఘు పనికర్ తదితరులు పాల్గొన్నారు.
దేశీయ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ నూతన విభాగంలోకి అడుగుపెట్టబోతున్నది. మూడు దశాబ్దాలకు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తున్న ఈ దిగ్గజ సంస్థ.. సెమికండక్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశిస్తున్నది. తెలంగాణలో అవుట్సోర్స్ సెమికండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్ట్(ఓశాట్), అసెంబ్లింగ్-టెస్టింగ్, మార్కెటింగ్ అండ్ ప్యాకేజింగ్
(ఏటీఎంపీ) యూనిట్లను నెలకొల్పడానికి ముందుకొచ్చింది.