ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాల ఉద్యమ ఆకాంక్ష, సుదీర్ఘ పోరాటాలతో సాధించుకొన్న తెలంగాణ జోలికొస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ‘తెలంగాణ ఏర్పాటుపై ఎందుకీ కక్ష’ అంశంపై శుక్రవారం లక్డీకాపూల్లో ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలోనిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, నైతిక, మానవ విలువలను మంటగలుపుతున్నదని, దేశాభివృద్ధి గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఏపీలో బీజేపీ బలపడేందుకు తెలంగాణను కించపరుస్తారా? అని నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా విడిపోయిన రాష్ర్టాలను తిరిగి కలపాలనుకోవడం అసంభవమని, అలాంటి పగటి కలలను మానుకోవాలని మోదీ సర్కార్కు హితవు పలికారు. తెలంగాణ అస్థిత్వ పరిరక్షణకు అందరూ సిద్ధంగా ఉండాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫోన్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. సమావేశంలో ఫోరం ఫర్ తెలంగాణ అధ్యక్షుడు బుచ్చయ్య, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, శ్రీరామ్ పాల్గొన్నారు.