హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదంటూ బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘ప్రపంచస్థాయి అధునాతన సిస్టం అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
అన్ని రకాలుగా అర్హతలున్న తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.