హైదరాబాద్: తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధులు సభ జరిగింది. ఆ సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాల్లో దేశంలో తాగు, సాగు నీటికి సంబంధించిన తీర్మానం కూడా ఉంది. అందులోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగు నీరు లభించక భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. అనేక పట్టణాలు, నగరాల్లో వారం పదిరోజులకు ఒకసారిగానీ తాగునీరు సరఫరా కావడం లేదు. ఇక పల్లెల సంగతి మరింత అధ్వాన్నం. మహిళలు బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్లకు మైళ్లు నడిచి తాగునీరు తెచ్చుకోవలసి వస్తున్నది. కడివెడు నీళ్లకోసం వీధిపోరాటాలకు దిగవలసి వస్తున్నది. కలుషిత జలాలు తాగడం వల్ల ఫ్లోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడి జీవితాలనే కోల్పోవలసి వస్తున్నది.
మనదేశంలో రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒక ప్రహసనంగా మారిపోయింది. రాష్ట్రాల వాటాలను తేల్చడం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు తరాలు గడిచిపోతున్నా తీర్పులు వెలువరించవు. అసమర్థ కేంద్ర ప్రభుత్వాలుంటే ఎట్లా ఉంటదంటే ట్రిబ్యునల్ కేసులపై రెండు, మూడు దశాబ్దాలైనా తీర్పులు రావు. ఎన్విరాన్ మెంటల్, గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్సులు రావడానికి మరిన్ని దశాబ్దాలు పడుతుంది. ప్రాజెక్టుల రూపకల్పన, డిజైన్ల ఖరారు, సీడబ్ల్యూసీ ఆమోదం, అనుమతులు ఇవి క్లియర్ కావడానికి ఇంకొన్ని దశాబ్దాలు అవుతుంది. ఈ అలసత్వం, అకారణ జాప్యం వల్ల కొన్ని తరాల ప్రజలు తమ విలువైన జీవితాలనే మూల్యంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికీ మహానది నీళ్ల కోసం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కొట్టుకోవాల్సిన అవసరం ఉందా? సట్లెజ్, దాని ఉప నదులైన రావి, బియాస్, చీనాబ్ నదుల జలాల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తన్నుకోవాల్నా?
నర్మదా జలాల కోసం గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ దాకా కొట్టుక చావాల్నా? కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ జుట్లు జుట్లు పట్టుకోవాల్నా? కృష్ణా, గోదావరి నదుల నీళ్ల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఎంతకూ తెగని నిరర్ధక పంచాయతీలు కొనసాగుతనే ఉండాల్నా? అత్యంత లోపభూయిష్టమైన నీటి విధానం వల్లనే దేశ ప్రజలు తరతరాలుగా తాగు, సాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నరు. చెప్పరాని బాధలు అనుభవిస్తున్నరు. దేశంలో ఇపుడు అవలంబిస్తున్న లోపభూయిష్టమైన నీటి వినియోగ విధానాన్ని సమూలంగా మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టింది.
రైతులే కేంద్రంగా నవభారత నిర్మాణం కోసం ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అంటూ గులాబీ జెండానెత్తింది. కండ్ల ముందు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్న దుస్థితిని తొలగించడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది.
ప్రకృతి ఇచ్చిన జల సంపదను సంపూర్ణంగా, సమగ్రంగా వినియోగంలోకి తీసుకురావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం ఇందు కోసం భారత ప్రజలను ఏకీకృతం చేసి, బలీయమైన రాజకీయశక్తిగా బీఆర్ఎస్ పురోగమించాలని ఈ సభ తీర్మానిస్తున్నది. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్మించాలి. ఈ నీళ్లలో ప్రతి రాష్ట్రానికీ తగిన నీటి కేటాయింపులు ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టునైనా కేంద్ర నిధులతో నిర్మించాలి. భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు తగిన విధంగా ఒక సమగ్ర సాగునీటి విధానం రూపొందాలి. తెలంగాణలో నెలకొల్పిన రైతురాజ్యం భారతదేశం అంతటా స్థాపించాలి. ఇందుకోసం అలుపెరగని పోరాటం దిశగా బీఆర్ఎస్ పార్టీ పురోగమించాలి అని నేటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.