లండన్: బ్రిటన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహాన్ని పోలిన నమూనాను మంత్రి ఆ మ్యూజియానికి బహూకరించారు.
లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో అంబేద్కర్ నివసించిన ఇంటిని ఆ తరువాత అంబేద్కర్ మ్యూజియంగా మార్చారు. ఇవాళ అంబేద్కర్ నివసించిన గదితో సహా మొత్తం భవనాన్ని మంత్రి కేటీఆర్ ఆసక్తిగా వీక్షించారు. ఇంకా చాలా విషయాలను మ్యూజియం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను అభినందిస్తూ.. ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్, బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్-యూకే (FABO UK) అధ్యక్షుడు సంతోష్ దాస్, జాయింట్ సెక్రెటరీ సీ గౌతమ్ మంత్రి కేటీఆర్కు ఓ లేఖను అందజేశారు.
‘అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనసాగిస్తూ తెలంగాణలో మీరు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అభినందనలు. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం తెలంగాణకే కాదు.. యావత్ భారత దేశానికి గర్వకారణం. నూతన సచివాలయ సముదాయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనపట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నది’ అని ఆ లేఖలో సీఎం కేసీఆర్ను ప్రశంసించారు.