హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి పర్యాటకరంగం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. ఎకో, కల్చరల్, టెంపుల్ టూరిజంలో మనకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. పర్యాటకులకు బెస్ట్ డెస్టినేషన్గా మారింది రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం తెలంగాణ కీర్తిని మరింత పెంచిం ది. చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో తెలంగాణ ముందున్నదని ప్రశంసల్లో ముంచెత్తిన నీతి ఆయోగ్.. తన ‘అర్థ్ నీతి’ నివేదికలో మన పర్యాటక రంగం స్థాయిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశంలో పర్యాటకులను అధికంగా ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కొనియాడింది. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సమ్మేళనాలు, ఎగ్జిబిషన్లకు హైదరాబాద్ నెలవుగా మారిందని స్పష్టం చేసింది.
ప్రాచుర్యంలోకి తెలంగాణ గమ్యస్థానాలు
రాష్ట్రంలో రామప్ప, సోమశిల, అనంతగిరిహిల్స్, బుద్ధవనం ప్రాజెక్టు-నాగార్జునసాగర్, లక్నవరం, దుర్గం చెరువు, భద్రాచలం, యాదాద్రి, వేయిస్తంభాల గుడి, గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రాష్ర్టానికి, రాజధాని హైదరాబాద్కు వచ్చే పర్యాటకుల సంఖ్య భా రీగా పెరిగింది. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ను దర్శిస్తున్నారు. స్వదేశీ పర్యాటకుల్లో 25 నుంచి 30% మంది, విదేశీయుల్లో 90 నుంచి 95% మంది హైదరాబాద్ను సందర్శిస్తున్నారు.
పర్యాటక కేంద్రాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు
తెలంగాణ ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో తగిన ప్రాధా న్యం లభించలేదు. రామప్పకు చాలా ఆలస్యంగా అంతర్జాతీయ గుర్తింపు రావడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వంతోనే ఈ గుర్తింపు లభించింది. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ పర్యాటకాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చారిత్రక ప్రాంతాలతోపాటు యాదాద్రి లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దేశం గర్వించేస్థాయిలో అభివృద్ధిచేస్తున్నారు. కొండపోచమ్మసాగర్, మిడ్మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులను అద్భుత పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ది తెలంగాణను దేశంలోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్గా మారుస్తాం.