హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటక రంగానికి నాలుగు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఈ సారి నాలుగు అవార్డులు గెలుచుకొన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పర్యాటకరంగం సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. దీనితోపాటు -ఉత్తమ గోల్ఫ్ కోర్స్ అవార్డును హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, ఉత్తమ రైల్వేస్టేషన్ అవార్డును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, -ఉత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డును హైదరాబాద్ అపోలో దవాఖాన దక్కించుకొన్నాయి. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతులు మీదుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అవార్డులు అందుకొన్నారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ను మోదీ అనుసరిస్తే దేశం నంబర్ వన్
ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను ప్రధాని మోదీ అనుసరిస్తే దేశం అన్నిరంగాల్లో నంబర్ వన్ అవుతుందని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ విధానాలతో తెలంగాణ దేశానికి టార్చ్ బేరర్గా నిలుస్తున్నదని చెప్పారు. అవార్డులు అందుకొన్న తర్వాత ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మాట్లాడుతూ.. కేంద్రం ఏ రంగంలో అవార్డులు ప్రకటించినా రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తున్నదని సంతోషం వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో 20కి 19 అవార్డులు, స్వచ్ఛభారత్లో 13 అవార్డులు దక్కాయని గుర్తుచేశారు. పర్యాటకరంగానికి నాలుగు అవార్డులు దక్కాయని, తెలంగాణ అభివృద్ధికి ఇవే నిదర్శనమని చెప్పారు.
తెలంగాణలో సంక్షేమం లేకపోతే, అభివృద్ధి జరగకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నదో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. అవార్డులకు బదులుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో కేంద్రం పోటీ పడాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు, ముఖ్యమంత్రులకు కేంద్రం సహకరిస్తే దేశం బాగుపడుతుందని అన్నారు.
తెలంగాణకు లభించిన పర్యాటక అవార్డులు ఇవే..