హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన జాతీయస్థాయి కార్యక్రమంలో నాలుగు జిల్లాలకు అవార్డులను అందజేశారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2015 ప్రకారం ప్రతి లక్ష జనాభాకు 80 శాతం మేరకు టీబీ కేసులను తగ్గించాల్సి ఉన్నది. 60 శాతం మేరకు తగ్గించిన నిజామాబాద్ జిల్లాకు బంగారు, 40 శాతం తగ్గించిన భద్రాద్రి-కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు వెండి, 20 శాతం తగ్గించిన ఖమ్మం జిల్లాకు కాంస్య పతకాలు వరించాయి. ఈ అవార్డులను రాష్ట్ర టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ రాజేశం, నిజామాబాద్ డీఎంహెచ్వో సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ శ్రీగణ, ప్లానింగ్ ఆఫీసర్ వాసుప్రసాద్ అందుకున్నారు. రాష్ర్టానికి అవార్డులు దక్కేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు.
రాష్ట్రంలో టీబీ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నది. పరీక్షల సంఖ్యను భారీగా పెంచడంతోపాటు తక్షణమే వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేసింది. కుటుంబంలో ఒకరికి టీబీ వచ్చినా, మిగతా సభ్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ ఛాతీ దవాఖానను నోడల్ సెంటర్గా ఎంపిక చేసింది. మల్టి డ్రగ్ థెరపీ, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ చికిత్స పొందేవారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నది. ప్రైవేటులో గుర్తించిన కేసులకు కూడా పూర్తి ఉచితంగా అన్నిరకాల పరీక్షలతోపాటు వైద్య చికిత్సలు అందిస్తున్నది. కోలుకున్నవారిని టీబీ చాంపియన్లుగా గుర్తించి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణలో 2025 నాటికి పూర్తి స్థాయిలో క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ దిశగా వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలి. టీబీ పరీక్షలతో పాటు వైద్యసేవలను వేగవంతంగా అందజేస్తున్నాం. టీబీ నియంత్రణలో సత్తా చాటి జాతీయ అవార్డులు పొందేందుకు కృషి చేసిన వైద్యాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.
– టీ హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
బంగారు పతకం : నిజామాబాద్
వెండి పతకం : భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ
కాంస్య పతకం : ఖమ్మం