రంగారెడ్డి : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబిచ్చారు.
జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, చిన్న జీయర్ స్వామి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా 7వందల కోట్ల రూపాయలను కేటాయించారని, 28 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు.
ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల సీసీ కెమెరాల ద్వారా నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణ ఉంటుందని, 26 జిల్లా పోలీసు కార్యాలయం అత్యద్భుతంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
సిద్దిపేటలో అత్యాధునిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు పేర్కొన్నారు. లండన్, అమెరికాకు ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యమైన సేవలు నిర్వహిస్తున్నామని వివరించారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ భవనం, సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్టులు లభిస్తున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.