హైదరాబాద్: యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అనంతరం గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రైతాంగానికి 1.21 కోట్ల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, ఎంఎస్పీతో ధాన్యం సేకరణ తదితర రైతు అనుకూల విధానాలతో దేశంలోనే యాసంగి ధాన్యం సేకరణలో మొదటి స్థాయిలో నిలిచామని, అదే స్పూర్తిని కొనసాగిస్తూ రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సమాయాత్తమవ్వాలని అధికారులకు సూచించారు.
కరోనా సంక్షోభంలోనూ 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతూనే.. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోటాగింగ్, ట్రాన్స్ పోర్టు, మిల్లర్ల అనుసంధానం, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని వనరులను సంపూర్ణంగా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉన్నతాధికారులతో అన్ని అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల అకాల వర్షాలు పడినా కొనుగోలు ఏర్పాట్లు చేసేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ను రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతామని చెప్పారు. సివిల్ సప్లయ్స్ శాఖకు సంబంధించిన సేవలను పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 7997512345ను మంత్రి గంగుల ప్రారంభించారు. వీటి ద్వారా కొత్త ఎప్ఎస్పీ కార్డుల సమస్యల పరిష్కారం, పోర్టబులిటీకి వీలు కలుగుతుంది. కార్యక్రమంలో మంత్రితోపాటు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ వి అనిల్ కుమార్, ఎఫ్సీఐ డీజీఎం కిరణ్ కుమార్, కంక్వేర్ ఈడీ జీఆర్ శేషగిరి రావ్, అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, పౌరసరఫరాల జీఎంలు, డిసీఎస్వోలు, డీఎంలు పాల్గొన్నారు.