హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైదరాబాద్లోని ఓ ఏరియా ఆస్పత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్ పోస్టులో జత చేసింది.
📸Pictured moments after being born with the help of midwives at the Area Hospital in Hyderabad, Telangana.
Telangana is a flag bearer for Midwifery in India, working towards respectful maternity care and a positive birth experience for mothers.#ForEveryChild, a healthy start pic.twitter.com/UVMKSm7loT
— UNICEF India (@UNICEFIndia) December 30, 2022
తెలంగాణలో మాతాశిశు సంరక్షణ భేష్గా ఉందని యునిసెఫ్ పేర్కొన్నది. మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు యునిసెఫ్ తన ట్వీట్లో వెల్లడించింది. మెటర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ సర్కార్ గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ కలిగే రీతిలో మిడ్వైవ్స్కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశ్నించింది. ఫర్ ఎవర్నీ చైల్డ్, ఎ హెల్తీ స్టార్ట్ అన్న హ్యాష్ట్యాగ్ను యునిసెఫ్ పోస్టు చేసింది.
గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైవ్స్ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలశాఖ నర్సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణను ఫెర్నాండేజ్ ఫౌండేషన్, యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ ఏరియా దవాఖానతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు దవాఖానల్లో నిర్వహిస్తున్నది. గజ్వేల్ పట్టణంలోని ఏరియా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా స్టాఫ్ నర్సులకు నిర్వహిస్తున్న మిడ్వైవ్స్ శిక్షణ విధానాన్ని ఆమె పర్యవేక్షించారు.
మిడ్ వైవ్స్ శిక్షణలో గర్భిణులు సాధారణ ప్రసవాలు జరుగడానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, సాధారణ ప్రసవాల వల్ల లాభాలు, గర్భిణికి సాధారణ ప్రసవాలపై విశ్వాసం కలిగేలా ఏవిధంగా చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.