హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు. కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 కేటాయింపులు ఇంకా అమల్లోకి రాకముందే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ పనులు చేపట్టిందన్నారు. అక్రమంగా పనులు కొనసాగించడంపై గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబీకి లేఖలు రాసిందని గుర్తుచేశారు.
కేఆర్ఎంబీ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తామన్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తంచేశారు. కేఆర్ఎంబీ సబ్ కమిటీ ఈ ఏడాది జనవరి 28న ఆర్డీఎస్ కుడికాలువను, ఆనకట్టను పరిశీలించాల్సి ఉన్నదన్నారు. కానీ బృందం సభ్యులు ఆనకట్టను పరిశీలించారే తప్ప, కుడికాలువ హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం జరుగుతున్న చోటికి వెళ్లలేదని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న కేఆర్ఎంబీ ఇచ్చిన సమాధానంలో అంతకుముందే జూలై 11న ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలోని ‘ఆర్డీఎస్ కుడికాలువ పనులను మేము చేపట్టడం లేదు. హెడ్ రెగ్యులేటరీ పనులు గతంలోనే పాక్షికంగా పూర్తయ్యాయి. పనులను ఎప్పుడో నిలిపివేశాం’ అనే పేరాను యథాతథంగా పొందుపరిచారని గుర్తుచేశారు. తెలంగాణ ఎన్నిసార్లు కోరినా కేఆర్ఎంబీ చర్యలు తీసుకోలేదని.. ఏపీ ప్రభుత్వం హెడ్ రెగ్యులేటరీ నిర్మాణ పనులను సైతం పూర్తి చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆర్డీఎస్ కుడికాలువ డీపీఆర్ను కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ), కేఆర్ఎంబీకి సమర్పించిందన్నారు. కేడబ్ల్యూడీటీ-2 కేటాయింపులు అమలయ్యే వరకు, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు డీపీఆర్ పరిశీలిన నిలిపివేయాలని ఈఎన్సీ మురళీధర్ కోరారు.