హైదరాబాద్, జూన్5 (నమస్తే తెలంగాణ): 2022-23 నీటి సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాటాలో 18 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని ప్రస్తుత 2023-24 నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ సోమవారం కేఆర్ఎంబీ చైర్మన్కు ఓ లేఖ రాశారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆ 18 టీఎంసీలను డ్యామ్లో అలాగే ఉంచిందని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్, నల్లగొండ, మిషన్ భగీరథ అవసరాల కోసం ఆ జలాలను క్యారీ ఓవర్ చేసుకునేందుకు వీలుకల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నీటి సంవత్సర వాటాలో ఆ జలాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లెక్కించకూడదని స్పష్టం చేశారు.