తెలంగాణ అనుసరిస్తున్న త్రీ ఐ మంత్ర (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్)తో అద్భుతమైన ఫలితాలు రావటం ఆనందంగా ఉన్నది. నీతిఆయోగ్ ర్యాంకుల్లో పెర్ఫార్మర్స్ క్యాటగిరీలో తెలంగాణ దేశంలో నంబర్వన్, ఓవరాల్గా రెండో బెస్ట్ స్టేట్గా నిలిచింది. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి వందనాలు. -మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 21, (నమస్తే తెలంగాణ): తెలంగాణ దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా మరోసారి నిలిచింది. సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల లక్ష్యసాధనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంక చూడకపోయినా.. అప్రతిహతంగా సత్తా చాటుతూనే ఉన్నది. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆవిష్కరణల సూచీయే ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ ఈ సూచీని విడుదల చేశారు. ప్రపంచ నవకల్పనల ఇండెక్స్ మార్గదర్శకాలను అనుసరించి నీతి ఆయోగ్ ఈ సూచీని ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణల సూచీలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. కర్ణాటకకు మొదటి ర్యాంకు వచ్చింది. తొలి రెండు ర్యాంకులు దక్షిణాది రాష్ర్టాలకే దక్కడం విశేషం. మూడో స్థానాన్ని హర్యానా సాధించింది. వీటితోపాటు ఈశాన్య రాష్ర్టాలు.. కొండ ప్రాంతాల క్యాటగిరీలో మణిపూర్, మేఘాలయ, ఉత్తరాఖండ్ మంచి పనితీరును కనబరచాయి. నగరాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, ఛండీగఢ్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాయి.
హైదరాబాద్ ది గ్రేట్
నవ కల్పనల సూచీలో తెలంగాణ దూసుకుపోతున్న తీరుపై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. ‘ప్రపంచంలోని ఐటీ సంస్థలకు అగ్రగామి గమ్యస్థానంగా హైదరాబాద్ ఉన్నది. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటుచేశాయి. పెద్ద పెద్ద స్టార్టప్లు ఇక్కడ ఉన్నాయి. నవ కల్పనల్లో సూచీలను మించి రాష్ట్రం దూసుకుపోతున్నది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్లతో కూడిన పాఠశాలల సంఖ్య 17 శాతం నుంచి 35 శాతానికి పెరగటం ఇందుకు ఒక ఉదాహరణ. ఉన్నత విద్యలో లక్ష జనాభాకు అడ్మిషన్ల సంఖ్య 9.7 శాతం నుంచి 15.7 శాతానికి పెరిగింది. పైవేటు సంస్థలతో పోలిస్తే ఈ పెరుగుదల ప్రశంసనీయమైనది. రాష్ట్రంలో సమర్థమైన, సృజనశీలురైన, నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సంఖ్య కూడా 0.3 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది. విజ్ఞాన ఉత్పాదకత రంగంలో తెలంగాణ అద్భుతంగా పనిచేస్తున్నది. ముఖ్యంగా పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ఇండస్ట్రియల్ డిజైనింగ్ వంటి వాటిలో మంచి పురోగతి సాధించింది. స్టార్టప్లు 4,900 నుంచి 9 వేలకు పెరిగాయి’ అని నీతి ఆయోగ్ తెలంగాణ ప్రగతి గమనాన్ని సంపూర్ణంగా విశ్లేషించింది. ముఖ్యంగా విజ్ఞాన విస్తరణలో తెలంగాణ జాతీయ సగటు (5.81) ను మించి దూసుకుపోతున్నదని పేర్కొన్నది. తెలంగాణ నుంచి 86 శాతం హైటెక్ ఎగుమతులు జరిగాయని తెలిపింది.
సవాళ్లకు పరిష్కారం
ఆవిష్కరణల సూచీ విడుదల సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ మాట్లాడుతూ- సుస్థిర, సమ్మిళిత ప్రగతికి ఆవిషరణలు ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లకు పరిషారం చూపుతాయన్నారు. నూతన ఆవిష్కరణలు కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి దూరం చేయడానికి జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తాయని వివరించారు. అంతిమంగా దేశం స్వయం సమృద్ధికి బాటలు ఏర్పడుతాయని అన్నారు. నీతి అయోగ్ సీఈవో అయ్యర్ ప్రసంగిస్తూ, భారత ఆవిషరణల సూచీ ద్వారా దేశంలో ఆవిషరణల స్థాయిని పర్యవేక్షించడంలో నీతిఅయోగ్ నిరంతర నిబద్ధత చూపుతున్నదన్నారు. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంయుక్తంగా దేశమంతటా ఆవిష్కరణల వ్యవస్థను మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఆవిషరణల సూచీ-2021 ర్యాంకుల వివరాలు
భారత ఆవిషరణల సూచీ-2021 రూపురేఖలు గత సంవత్సరం నివేదికలాగానే ఐదు ‘స్వశక్తీకరణ’ అంశాలు.. ఉత్పాదకాలను అంచనా వేశాయి. మిగిలిన రెండు ‘పనితీరు’ ఫలితాలను మూల్యాంకనం చేశాయి. స్వశక్తీకరణలోని అన్ని సూచీలూ రాష్ట్రం/కేంద్రం పరిధిలో ఆవిషరణల ప్రోత్సాహానికి అవసరమైన కీలకాంశాలను పర్యవేక్షించాయని, పనితీరులోని సూచీలు విజ్ఞాన సృష్టి, పోటీతత్వంలో దేశం ఉత్పాదకతను తేటతెల్లం చేశాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు నీరజ్ సిన్హా వివరించారు. దేశ స్వావలంబన, ప్రతిరోధకతను ప్రోత్సహించడంలో ఆవిషరణల పాత్ర ఎంతో కీలకమని. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో ఆవిషరణల వికేంద్రీకరణను సూచీలోని అంశాలు సూచిస్తాయని పేర్కొన్నారు.
ఆవిష్కరణల అగ్రగామి తెలంగాణ
భారత ఆవిష్కరణ సూచీలో 17.66 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కార్యస్థానంలో 15.24, ప్రోత్సాహకాల్లో (ఎనేబ్లర్స్) 20.8, మానవ వనరుల్లో 26.96, పెట్టుబడుల్లో 6.49, నైపుణ్యం గలిగిన ఉద్యోగుల కల్పనలో 9.17, వ్యాపార వాతావరణ కల్పనలో 36.54, భద్రత, న్యాయపరమైన వాతావరణ కల్పనలో 2124, విజ్ఞాన విస్తరణలో 10.86, విజ్ఞాన ఉత్పాదనలో 19.61 స్కోరు సాధించింది.
మానవ వనరుల పెట్టుబడి
మానవ వనరుల పెట్టుబడిలో తెలంగాణ సంతృప్తికర స్థాయిలో దూసుకుపోతున్నదని నీతిఆయోగ్ ప్రశంసించింది. మానవ వనరుల పెట్టుబడిలో తెలంగాణ స్కోర్ 26.96 కాగా, ఇందులో పాఠశాలలో కంప్యూటర్ సౌకర్యం 35.34 స్కోర్, జీఎస్డీపీలో పాఠశాల విద్యపై వ్యయం 12.43 స్కోర్, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల సగటు 77.95 స్కోర్, ఉన్నత విద్యలో బోధకుల సగటు 77.37 స్కోర్, స్కూల్ ఎడ్యుకేషన్లో 83.75 స్కోర్ సాధించినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది.
భద్రత, న్యాయపరమైన వాతావరణ కల్పన
పెట్టుబడులకు సంబంధించి పూర్తి భద్రత, న్యాయపరమైన రక్షణ వాతావరణం కల్పించడంలో తెలంగాణ 21.24 స్కోరు సాధించింది. ఐటీ/ఐపీ సంబంధిత యాక్ట్లో 94.48 స్కోరు లభించింది.
విజ్ఞానం వ్యాప్తి
నాలెడ్జి వ్యాప్తిలో తెలంగాణ స్కోర్ 10.86 కాగా, హైటెక్ ఎగుమతుల స్కోర్ 92.95, ప్రశంసల స్కోర్ 60.65, సాఫ్ట్వేర్ ఎగుమతుల స్కోర్ 15.56గా పేర్కొన్నారు.
ఆవిష్కరణల సూచీ అంటే ఏమిటి?
దేశంలో ఆవిషరణల ప్రగతిని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సమగ్ర ఉపకరణమే భారత ఆవిషరణల సూచీ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆవిషరణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసి, వాటికి ర్యాంకులు ఇస్తుంది. అదే క్రమంలో ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆవిషరణల సూచీ చట్రం ప్రాతిపదికగా రూపొందిన ప్రస్తుత మూడో వార్షిక సూచీ దేశంలో ఆవిషరణలపై విశ్లేషణ పరిధిని చాటిచెప్తున్నది. గతంలో భారత ఆవిషరణల సూచీ-2020 లో సూచికల సంఖ్య 36 కాగా, ప్రస్తుతం-2021లో ఇవీ 66 కు పెరిగాయి. ఈ సూచికల్లో 7 మూల స్తంభాలు కాగా, మరో పదహారు కీలకమైనవిగా పరిగణిస్తారు. అంతర్జాతీయ సూచీల ద్వారా ఎంపిక చేసిన కొన్ని ప్రపంచ సూచీలను పర్యవేక్షించడంలో ప్రభుత్వ కృషికి నోడల్ సంస్థ హోదాలో నీతి ఆయోగ్ రూపొందించే భారత ఆవిషరణల సూచీ దోహదం చేస్తుంది. కొన్ని అంతర్జాతీయ సమాంతర అంశాలనూ ఇతర దేశాలతో సమానంగా ఉండటాన్ని ఈ ఇండెక్స్ సూచిస్తుందని కాంపిటీటివ్నెస్ చైర్మన్ డాక్టర్ అమిత్ కపూర్ తెలిపారు.
వ్యాపార అనుకూల వాతావరణం
వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఈ అంశంలో మెరుగైన స్థితిని కనబరచింది. ఈ క్యాటగిరీలో తెలంగాణ 36.54 స్కోర్ వచ్చింది. సులభతర వాణిజ్యంలో 55.99, పటిష్ఠమైన క్లస్టర్ల ఏర్పాటులో 28.81, స్థూల మూలధన కల్పనలో 40.19.. సూక్ష్మ ఆర్థిక సంస్థల అభివృద్ధిలో 98.45, ఆధార్తో అనుసంధానం అయిన బ్యాంక్ ఖాతాల్లో 88.82, జీఎస్డీపీలో ఉత్పాదకరంగం వాటాలో 72.40, గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పనలో 98.49 స్కోరు సాధించింది.