హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్రంలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ 15.75 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేసి తొలిస్థానంలో నిలిచినట్లు తెలిపారు. 2020, 2021 యాసంగి సీజన్లలో ఏ రాష్ట్రంలో ఎన్ని హెక్టార్లలో పంటలు సాగయ్యాయని లోక్సభలో సభ్యులు సంజయ్ సేథ్, కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణలో గతేడాది యాసంగి సీజన్లో 7.47 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని, ఈ ఏడాది యాసంగిలో సాగు విస్తీర్ణం 11.24 లక్షల హెక్టార్లకు పెరిగిందని తోమర్ వివరించారు.