సుల్తాన్బజార్, మార్చి 20. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మక్కల హనుమంతు కస్టడీ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రూ.5 లక్షల పరిహారాన్ని సిఫారసు చేసింది. మృతుడి కుటుంబానికి పరిహారం అందజేయాలని కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేశారు. నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండలం, కొత్తపల్లి గ్రామం, బురిడిగల్లీకి చెందిన మక్కల హనుమంతును 2017 మే 16న అరెస్టు చేసిన నవీపేట్ పోలీసులు జిల్లా జైలులో నిర్భంధించి ఉంచారు. కాగా అదే యేడాది సెప్టెంబర్ 8న అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెంఆడు. ఈ మరణంపై దర్యాప్తు జరిపి ఇచ్చిన మెజిస్టీరియల్ మెజిస్ట్రియల్ విచారణ నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీలించిన కమిషన్.. హనుమంతు జైలులో ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక మరణించినట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది.
అయితే అతడు ఉరివేసుకోవడానికి ఉపయోగించిన వైర్ జైలు ప్రాంగణంలో లభ్యమవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నదని కమిషన్ అభిప్రాయపడింది. ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలకు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, రక్షణ సమానంగా వర్తిస్తాయని గుర్తుచేసింఇ. కస్టడీలో జరిగిన ఇటువంటి మరణాలకు రాష్ట్రం భాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 కింద ఉన్న అధికారాలను వినియోగించి మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలని సిఫారసు చేస్తూ విచారణను ముగించింది.