Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, మద్యం స్మగ్లింగ్ ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ పోలీసులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను, మద్యం స్మగ్లింగ్ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజీ కలిసి ఐజీలు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహముద్ అలీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, మద్యం స్మగ్లింగ్ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మద్యం స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఒక్క రైతు కూడా నష్టపోకుండా నకిలీ విత్తనాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం క్యాబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా డీజీపీని భాగస్వామిని చేసి చర్చించింది. కల్తీకి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని క్యాబినెట్ సూచించింది. సీఎస్, డీజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ అంశంపైనా సబ్ కమిటీ పనిచేయనున్నది.