చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. ‘తెలంగాణపై వివక్ష ఇక ఆపండి’ అంటూ కేసీఆర్ హెచ్చరిస్తున్నట్లు వెలిసిన హోర్డింగ్లు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాల్సిందేనని అన్నదాతలతో కలిసి తెలంగాణ సర్కారు ఉద్యమిస్తోంది. ఇందుకోసం ఐదంచెల కార్యచరణ ప్రకటించింది. ఢిల్లీ నాయకులకు చెమటలుపట్టేలా నాలుగంచెల నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. చివరగా ఈ నెల 11న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించతలపెట్టింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా తరలివెళ్లనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముందే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ హోర్డింగ్లు వెలిశాయి.
‘వన్ నేషన్-వన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ’ ఉండాలనే డిమాండ్తో ఈ హోర్డింగ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించేలా కేసీఆర్ ముఖచిత్రంతో ఈ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీసేలా ఏర్పాటైన హోర్డింగులు విస్తృతమైన చర్చకు తెరలేపాయి.