హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో సంస్కరణలను తీసుకొస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకే డిగ్రీని డిస్టెన్స్లో, రెగ్యులర్గా చదువుకొనే అవకాశం కల్పిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నది. రాష్ట్రంలోని ఆరు కన్వెన్షనల్ వర్సిటీలు, మూడు ఓపెన్ వర్సిటీలు ఈ విధానంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంయుక్తంగా డిగ్రీలు జారీచేస్తాయి. ఇందుకు విద్యార్థులు సాధించిన క్రెడిట్స్ను ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి బదిలీ చేస్తారు. వీటి అమలుకు త్వరలోనే ఉన్నత విద్యామండలి పూర్తి మార్గదర్శకాలను జారీ చేయనున్నది. ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
ఎలాగంటే…
ఆరు కన్వెన్షనల్ వర్సిటీలైన ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో డిగ్రీలో విద్యార్థులు రెండు సబ్జెక్టులను రెగ్యులర్గా, ఒక సబ్జెక్టును దూరవిద్య ద్వారా పూర్తిచేసుకోవచ్చు.
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పీజీఆర్ఆర్సీడీఈ (ఓయూ), ఎల్డీఎల్సీఈ (కేయూ)ల్లో ఒక సబ్జెక్టును దూర విద్య ద్వారా పూర్తిచేసుకోవచ్చు.
రెండు సబ్జెక్టులకు పరీక్షలను రెగ్యులర్ వర్సిటీ, ఒక సబ్జెక్టుకు పరీక్షలను దూరవిద్య వర్సిటీ నిర్వహిస్తుంది. ముల్యాంకనం సైతం ఏ వర్సిటీవి ఆ వర్సిటీయే చేపడుతుంది.
ఒక సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థి సాధించిన క్రెడిట్లను, రెగ్యులర్ డిగ్రీ చదువుతున్న వర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసి ఒకే డిగ్రీ సర్టిఫికెట్ను అందజేస్తారు.